గణేషా... వీడ్కోలికా...
కర్నూలు : నవరాత్రి పూజలు అందుకున్నగణేష్ కు వీడ్కోలు పలుకుతూ సాంస్కృతిక ప్రదర్శనల మధ్య ఊరేగింపుగా బయలుదేరిన వందలాది వినాయక విగ్రహాలను వినాయక ఘాట్ వద్ద నిమజ్జనం చేశారు. ఇరవై సంవత్సరాల క్రితం కెనాల్ సమీపంలో వినాయక ఆలయాన్ని నిర్మించారు. అప్పటి నుంచి ఈ ప్రాంతం వినాయక ఘాట్ గా ప్రాచుర్యం పొందింది. స్థానిక ప్రముఖులు, రాజకీయ నాయకులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు స్థానిక రాంబొట్ల దేవాలయం వద్ద ఊరేగింపును ప్రారంభించారు. సోమవారం సాయంత్రానికి వినాయక్ ఘాట్ చేరిన ఊరేగింపు అర్థరాత్రి దాటినా కొనసాగింది. గణేష్ నిమజ్జన ఉత్సవాల్లో కర్నూలు మెడికల్ కాలేజీ విద్యార్థులు, చిన్నారులు వేసిన విచిత్ర వేషధారణలు ఆద్యంతం అలరించాయి. దేవతల వేషాలే కాకుండా, అపరచితుడు, మగధీర, అరుంధతి వంటి హిట్ సినిమాల్లో హీరో, విలన్ పాత్రల వేషధారణతో యువత స్థానికుల అభిమానాన్ని చూరగొన్నారు.
News Posted: 1 September, 2009
|