15న కోయల్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుపతి : ప్రసిద్ధి చెందిన తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. పసుపు, చందనం, కుంకుమ, తిరునామం, పచ్చకర్పూరం తదితర మిశ్రమాలతో తయారు చేసిన లేపనంతో అర్చకులు ఆలయాన్ని శుభ్రం చేస్తారు. ఈ సందర్భంగా సర్వదర్శనం మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు. గర్భాలయ సన్నిధిలోని గోడలతోపాటు, ఆలయంలోని ఉత్సవ విగ్రహాలైన వకులమాళిక, భాష్యకారులు, యోగనరసింహస్వామి, వరదరాజస్వామి, తదితర దేవతా మందిరాలను కూడా శుభ్రపరుస్తారు. ప్రసాదాలు తయారు చేసే పోటులను కూడా శుద్ధి చేస్తారు. ఈ కార్యక్రమంలో పాల్గొనదలచిన భక్తులు మూడువేల రూపాయల ఆర్జితం చెల్లించి టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. దీనిపై గృహస్థుతోపాటు పదిమందిని దర్శనానికి అనుమతిస్తారు. ప్రతి సంవత్సరం నాలుగుసార్లు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఉగాది, అణవార ఆస్థానం, వార్షిక బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాలకు ముందుగా వచ్చే మంగళవారాలలో ఈ తిరుమంజనం కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
News Posted: 14 September, 2009
|