కరవు సహాయక చర్యలు
(వేముల సదానందం)
వరంగల్ : జిల్లాలో ఏర్పడిన తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో కరవు సహాయక చర్యలను సమర్థవంతంగా చేపట్టి ప్రజలకు ఏవిధమైన సమస్యలు రాకుండా చూడాలని జిల్లా అధికారులను అజయ్ మిశ్రా ఆదేశించారు. కరవు నివారణ చర్యలపై జిల్లాకు ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారి, హోం శాఖ ప్రన్సిపాల్ సెక్రటరీ అజయ్ మిశ్రా బుధవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో మిశ్రా మాట్లాడుతూ కరవు పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రణాళికా బద్దంగా కృషి చేయాలన్నారు. జిల్లాలో పశుగ్రాస కొరతను ఎదుర్కోవడానికి వంద క్వింటాళ్ళ అదనపు పశుగ్రాస విత్తనాలు జిల్లాకు పంపించడంతో పాటు, జిల్లాలో ఖాళీగా ఉన్న 14 మంది వ్యవసాయ అధికారుల పోస్టులను భర్తీకిగాను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు.
కలెక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ నీటి సమస్యను ఎదుర్కోవడానికి 70 లక్షల రూపాయాలో తక్షణ చర్యలు చేపాట్టామని తెలిపారు. అలానే కరవు వల్ల ఎవరూ వలసపోకుండా ఉండేందుకు ఉపాధి హామీ పథకంలో పనులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కూరగాయల కొరతను ఎదుర్కొనేందుకు గాను రెండు వేల హెక్టార్లలలో కూరగాయల పెంపుకోసం 70 శాతం సబ్సిడీ విత్తనాలను అందజేయనున్నట్లు తెలిపారు. ప్రత్యేక కౌంటర్ల ద్వారా తక్కువ ధరకే బియ్యం అమ్మకాలను జరుపుతున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఎన్.శ్రీధర్, జాయింట్ కలెక్టర్ వాకాటి కరుణ, డిఆర్ ఓ శ్రీరాంరెడ్డితో పాటు వ్యవసాయ శాఖ, పసు సంవర్ధక శాఖ, ఉపాధి హామీ, గ్రామీణ మంచినీటి సరఫరా ఎపి ట్రాన్స్ కో, ముఖ్య ప్రణాళికాధికారి తదితరులు పాల్గొన్నారు.
News Posted: 17 September, 2009
|