19 నుండి దసరా ఉత్సవాలు
విజయవాడ : పవిత్ర పుణ్యక్షేత్రమైన ఇంద్రకీలాద్రి శరన్నవరాత్రులకు ముస్తాబైంది. శనివారం నుండి ప్రారంభమయ్యే ఈ ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. కనకదుర్గ అమ్మవారు ఈ నవరాత్రుల సందర్భంగా రోజుకొక అలంకారంతో భక్తులకు కనువిందు చేయనున్నారు. ప్రతిరోజూ తెల్లవారిజామున 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అమ్మవారి దర్శనం ఉంటుంది. దేవాదాయశాఖ మంత్రి, జిల్లా మంత్రి పార్దసారధి, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్, కలెక్టర్, దేవస్థానం ఈవో, మునిసిపల్ కమిషనర్, ఇతర అధికారులు ఎప్పటికప్పుడు ఈ ఉత్సవాల ఏర్పాట్లపై భక్తులకు అసౌకర్యం కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని అన్నారు. వీఐపీలు, సిఫారసు లేఖలు తెచ్చుకున్న భక్తులు తప్పనిసరిగా 200 రూపాయల టికెట్ ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. శరన్నవరాత్రుల సందర్భంగా గురువారం నాడు మంత్రి పార్ధసారధి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. దసరా మహోత్సవాల సందర్భంగా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ను మళ్ళించనున్నారు. అలానే దుర్గ గుడికి వచ్చే మార్గంలో ఎనిమిది చోట్ల ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లను చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
News Posted: 18 September, 2009
|