కుప్పంలో పట్టుగూళ్ళ కొనండి
హైదరాబాద్ : బైవోల్టిన్ పట్టుగూళ్ళ కొనుగోలు కేంద్రాన్ని కుప్పంతో పాటు హిందూపూర్లో కూడా కొనసాగించాలని పట్టు పరిశ్రమ కమిషనర్ ను టిడిపి అధ్యక్షుడు చంద్రబాబునాయుడు కోరారు. బాబు విజ్ఞప్తికి కమిషనర్ సానుకూలంగా స్పందించినట్లు టిడిపి ఒక ప్రకటనలో తెలిపింది. కుప్పంలో సెరికల్చర బైవోల్టిన్ మార్కెట్ ను 2009 సెప్టెంబర్ 1న హిందూపురానికి మార్చారు.
పట్టుగూళ్ళ కొనుగోలు కేంద్రాన్ని కుప్పం నుంచి హిందూపురానికి తరలించడంతో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించేందుకు కుప్పం నియోజకవర్గానికి చెందిన 200 మంది రైతులు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో చంద్రబాబును శుక్రవారం కలిశారు. వారి విజ్ఞప్తిపై వెంటనే స్పందించిన చంద్రబాబు టెలిఫోన్ లో కమిషనర్ తో మాట్లాడి రైతుల ప్రయోజనాల దృష్ట్యా కుప్పంలో కొనుగోలు కేంద్రం కొనసాగించాలని కోరారు.
చిత్తూరు జిల్లాలోని వి.కోట, రామకుప్పం, శాంతిపురం, గుడిపల్లి, కుప్పం మండలాల రైతులు పట్టు పరిశ్రమ శాఖ అధికారుల సహాయ, సహకారాలతో బైవోల్టిన్ సాగు చేస్తున్నారు. ఈ పంట సాగులో జిల్లా రైతులు రాష్ట్రంలోనే ముందంజలో ఉన్నారు. ఆదర్శ రైతులుగా కూడా ఎంపికయ్యారు. కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా రైతులు వచ్చి పంట సాగును పరిశీలించారు. ఆదర్శ రైతులు హనుమంతప్ప, మునిరెడ్డి, వెంకటరాయప్ప, హరి, సూర్యమూర్తి తదితరులు చంద్రబాబును కలిసినవారిలో ఉన్నారు.
News Posted: 19 September, 2009
|