వ్యవసాయ కార్మిక వజ్రోత్సవం
నెల్లూరు : నెల్లూరు జిల్లాలో జరగనున్న వ్యవసాయ కార్మిక సంఘం సెప్టెంబర్ 22 నుండి అయిదు రోజులు పాటు వజ్రోత్సవాలను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం ప్రముఖ నేతలు పాల్గొంటారు. వ్యవసాయ కూలీలకు మెరుగైన జీవనాన్ని అందించాలన్న లక్ష్యంతో 1933లో ఏర్పడిన వ్యవసాయ కార్మిక సంఘం 75 వసంతాలు పూర్తవుతున్న సందర్బంగా ఈ వజ్రోత్సవాలను జరుపుకోనుంది. దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత పుచ్చలపల్లి సుందరయ్య వ్యవసాయ కూలీలకు మెరుగైన జీవన విధానం కోసం వ్యవసాయ కూలీ సంక్షేమ సంఘాన్ని స్థాపించారు. అనంతర కాలంలో కూలీ అనే పదం బానిసత్వాన్ని సూచిస్తుందనే ఉద్దేశంతో కూలీ స్థానంలో కార్మిక పదాన్ని చేర్చి వ్యవసాయ కార్మిక సంఘంగా మార్చారు. మంగళవారం ఏబీఎం కాంపౌండు నుంచి ర్యాలీ నిర్వహిస్తారు. అనంతరం వీఆర్ సీ మైదానంలో బహిరంగ సభ ఉంటుంది. 23 నుంచి కస్తూరిబా కళాక్షేత్రంలో ప్రతినిధుల సమావేశాలు జరుగుతాయి. 24వ తేదీన వ్యవసాయరంగం, ఆర్థిక రంగం, ప్రభుత్వ పధకాల అమలుపై సెమినార్ నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాలకు సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు, వ్యవసాయకార్మిక సంఘం అఖిల భారత అధ్యక్ష కార్యదర్శులు పాటూరు రామయ్య తదితర ప్రముఖులు హాజరుకానున్నారు.
News Posted: 21 September, 2009
|