దుర్గమ్మ సేవకు సీఎం రోశయ్య
విజయవాడ : దసరా శరన్నరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఏడవ రోజు శుక్రవారం మూలా నక్షత్రంనాడు అమ్మవారు శ్రీ సరస్వతీ దేవిగా దర్శనమిస్తున్నారు. మూలా నక్షత్రం సందర్భంగా కనకదుర్గమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించేందుకు ముఖ్యమంత్రి రోశయ్య ఇంద్రకీలాద్రికి నేడు చేరుకోనున్నారు. శుక్రవారంనాడు శుద్ధ సప్తమి రోజున అమ్మవారి జన్మనక్షత్రమైన మూలా నక్షత్రం కావడంతో భక్తులు విశేష సంఖ్యలో ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. అమ్మవారి జన్మనక్షత్రం రోజున వీణాపాణి అయిన సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. సిఎంతో పాటు దేవాదాయ శాఖ మంత్రి గాదె వెంకటరెడ్డి, జిల్లా ఇన్ ఛార్జి మంత్రి, రాష్ట్ర అటవీ పర్యావరణ పరిరక్షణ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాష్ట్ర ఆరోగ్య శ్రీ, ఆరోగ్యబీమాల మంత్రి పితాని సత్యనారాయణ తదితరులు నగరానికి విచ్చేయనున్నారు. వేదపండితులు వేదం చుదువుతుండగా, మేళ తాళాల మధ్య ఆయన తలకు పాగా చుట్టి, ప్రభుత్వం తరఫున అమ్మవారికి సమర్పించనున్న పట్టు వస్త్రాలు ఉంచిన పళ్ళెరాన్ని ఆయన శిరస్సున ఉంచుతారు. ఆయన లోపలికి రాగానే అంతరాలయంలో అర్చన ఉంటుంది. ముఖ్యమంత్రి రాకకోసం ఏర్పాటుచేసిన బందోబస్తును, ఆయన పర్యటించే ప్రాంతాలను ఇంటిలిజెన్స్ విభాగం ఉన్నతాధికారులు గురువారం పరిశీలించారు. సహజంగా సప్తమీ, మూలనక్షత్రం కలిసి రావాల్సి ఉంటుంది. అయి తే సప్తమి తిథితో కలిసి మూల నక్షత్రం శుక్రవారం సాయంత్రం 5.45 గంటలకు రానుండటంతో అమ్మవారు శుక్రవారం, శనివారం ఉదయం ఎనిమిది గంటల వరకు శ్రీ సరస్వతీ దేవీ అలంకారంలో దర్శనమివ్వనున్నారు.
News Posted: 25 September, 2009
|