ఊపిరి పోసిన వర్షం
గుంటూరు : జిల్లాలో గత మూడు రోజులుగా అడపాదడపా ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత 20 రోజులుగా ఆగిపోయిన వర్షాలు మళ్ళీ ప్రారంభం కావడంతో రైతుల్లో ఆనందోత్సవాలు వ్యక్తమవుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా ఏర్పడిన ఈ వర్షాల వల్ల తమకు మేలు కలుగుతోందని రైతులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రధానంగా పత్తి, మిర్చి పంటలకు ఈ వర్షాలు ఊపిరిపోశాయన్నారు. చాలీ చాలని నీటితో కృష్ణా పశ్చిమ డెల్టా చివరి భూముల్లో నాట్లకు ఈ వర్షాలు మేలు చేశాయని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రామకృష్ణ మూర్తి చెప్పారు. జిల్లాలో ఆగష్టు నెలలో సగటు వర్షపాతం 152 మిల్లీమీటర్లు కురవాల్సి ఉండగా 200 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అయితే సెప్టెంబర్లో దాదాపు 20 రోజులపాటు ఎక్కువ మండలాలో వర్షాలు కురవలేదు. దీంతో రైతుల్లో కొంత ఆందోళన ప్రారంభమైంది. ఈ నేపధ్యంలో ఈనెల 27 నుంచి 29 వరకు పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
News Posted: 30 September, 2009
|