'పల్లె పిలుపు'
విశాఖపట్నం : మండల, గ్రామ స్థాయిల్లోనే ప్రజల సమస్యలను పరిష్కరించి వారిని సంతృప్తి పరచాలన్న ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ శ్యామలరావు 'పల్లె పిలుపు' కార్యక్రమానికి మంగళవారం ఉదయం శ్రీకారం చుట్టారు. ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించే గ్రీవెన్స్ సెల్ కు నలుమూలల నుంచి వచ్చే బాధితుల సంఖ్యను గుర్తించిన కలెక్టర్ వారి సమస్యలను వారి వద్దకే వెళ్ళి పరిష్కరించాలని నిశ్చయించుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాలో ఉన్న ప్రతి ప్రభుత్వ ఉద్యోగిని భాగస్వామిగా చేసి ప్రజలకు విస్తృతమైన సేవలను అందించేలా కలెక్టర్ ప్రణాళికను రూపొందించారు. ఇందుకోసం మండలాలకు ప్రత్యేక అధికారులను నియమించారు. ఈ కార్యక్రమాన్ని వచ్చేనెల లోని నాలుగు మంగళవారాలు మాత్రమే నిర్వహిస్తారు.
డిసెంబర్ లోని నాలుగు మంగళవారాల్లోను మొదటి మంగళవారం మండల కేంద్రంలో అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించి ఆయా మండలం పరిధిలో ఉన్న గ్రామాల స్థితిగతులపై ఒక ప్రణాళిక రూపొందించుకుంటారు. రెండో మంగళవారం రెండు గ్రామ పంచాయతీల చొప్పున తనిఖీలు చేపడతారు. ఉదయం 8.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఒక గ్రామ పంచాయతీని, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మరొక గ్రామ పంచాయతీని తనిఖీ చేసి అక్కడి ప్రజలతో మమేకమవుతారు. మూడో మంగళవారం పల్లెపిలుపు వల్ల ప్రజలకు జరిగిన మేలును సమీక్షిస్తారు. ఇంకా చేయాల్సిన మేలు గురించి మరొక కార్యచరణ రూపొందిస్తారు. నాలుగో మంగళవారం జిల్లా స్థాయిలో సమీక్ష నిర్వహించి జిల్లా పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తారు.
News Posted: 10 November, 2009
|