కనక మహాలక్ష్మి ఉత్సవాలు ప్రారంభం
విశాఖపట్టణం : విశాఖ వాసుల ఇలవేల్పు అయిన కనకమహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాలు అంగరంగ వైభంగా ప్రారంభమయ్యాయి. మంగళవారం ప్రారంభమైన ఈ ఉత్సవాలలో భాగంగా ముందుగా గణపతి పూజను నిర్వహించారు. తదుపరి పంచామృతాభిషేకం, లక్ష్మీ హోమం చేశారు. ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని విద్యుద్దీపాలతో, పూల మాలలతో అంగరంగ వైభవంగా అలంకరించారు. భక్తులు ఉదయం ఐదు గంటల నుండే కనకమహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. శాసనసభ్యుడు ద్రోణం రాజు శ్రీనివాసు జ్యోతి ప్రజల్వన చేసి ఉత్సవాలు ప్రారంభించారు. దేవస్థానం సంప్రదాయాలకు అనుగుణంగా పూర్ణకుంభంతో ఆయనకు ఘన స్వాగతం పలికి, కండువ సత్కారాలతో ఆలయం లోపలికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తులకు మౌలిక సదుపాయాల్లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త వహించాలని అధికారులు సూచించారు. బుధవారం రాత్రి (తెల్లవారితే గురువారం) 12.05 గంటలకు అమ్మవారికి స్వర్ణాభరణ అలంకరణలో పంచామృతాభిషేక సేవ, సహస్ర నామార్చన విశేష పూజలు నిర్వహిస్తారని ఆలయ సిబ్బంది తెలిపారు.
News Posted: 18 November, 2009
|