శ్రీవారి సేవలో రోశయ్య
తిరుపతి : ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య బుధవారం సాయంత్రం తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనానికి ముఖ్యమంత్రి రాక సందర్భంగా పూజారులు, అధికారులు ఆలయం ముందు ఆలయ మర్యాద ఇష్టిపాకల్ ప్రకారం ఆయనకు స్వాగతం పలికారు. శ్రీనివాసుని ముఖ్యమంత్రి రోశయ్య దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపం వద్ద టిటిడి చైర్మన్ డి.కె. ఆదికేశవులు నాయుడు, ఈఓ ఐవైఆర్ కృష్ణారావు శ్రీవారి ప్రసాదాన్ని అందజేశారు. వేద పండితులు ముఖ్యమంత్రిని వేద మంత్రాలతో ఆశీర్వదించారు. రోశయ్య వెంట మంత్రులు రామచంద్రారెడ్డి, గల్లా అరుణకుమారి ఉన్నారు.
అఖిల భారత కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ తిరుపతి పర్యటనకు వస్తున్న సందర్భంగా కలుసుకునేందుకు ముఖ్యమంత్రి రోశయ్య హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా తిరుపతి వచ్చారు. అయితే, రాహుల్ తిరుపతికి కృష్ణాజిల్లా గన్నవరం నుంచి నేరుగా విమానంలో తిరుపతి వచ్చిప్పటికీ భారీ వర్షం కారణంగా పర్యటన రద్దు చేసుకొని నేరుగా అదే విమానంలో ఢిల్లీ వెళ్ళిపోయారు. రాహుల్ తో భేటీ అయ్యే అవకాశం లేకపోవడంతో అనంతరం రోశయ్య నేరుగా తిరుమల చేరుకున్నారు. శ్రీవారిని దర్శించుకున్నారు.
వేంకటేశ్వరస్వామిని ముఖ్యమంత్రి దర్శించుకున్న సందర్భంగా జిల్లా కలెక్టర్ వి. శేషాద్రి, టిటిడి ప్రత్యేకాధికారి ఎ.వి. ధర్మారెడ్డి, సివి అండ్ ఎస్ఓ పివిఎస్ రామకృష్ణ, జిల్లా పోలీసు సూపరింటెండెంట్ లక్ష్మీరెడ్డి, అదనపు ఎస్పీ అమ్మిరెడ్డి, టిటిడి అధికారులు ఆయన వెంట ఉన్నారు.
News Posted: 18 November, 2009
|