ప్రమాదంలో 8 మంది మృతి
నెల్లూరు : ఆదివారం అర్ధరాత్రి నెల్లూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పెళ్ళికొడుకు తల్లి పుష్పవతి, తండ్రి ఆంజనేయులు, తమ్ముడు శ్రీకాంత్, బాబాయి రమేష్, నానమ్మ ఆదెమ్మ, చిన్నమ్మ ఆత్మకూరి సుబ్బరత్నం, డ్రైవర్, కోటేశ్వరరావు అనే బంధువు మరణించారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని పెళ్ళిబృందం ప్రయాణిస్తున్న వ్యాన్ ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. మృతులంతా గుంటూరు జిల్లా వినుకొండకు చెందినవారు. నెల్లూరు సమీపంలోని జాతీయ రహదారిపై చిల్డ్రన్ పార్క్ వద్ద ఆగి ఉన్న లారీని పెళ్ళిబృందాన్ని తీసుకువెళుతున్న క్వాలిస్ వాహనం వెనుక నుంచి ఢీకొన్నదని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రమాద స్థలం వద్దే మరణించగా మరో ఇద్దరిని ఆస్పత్రికి తరలించిన తరువాత మరణించారని చెప్పారు.
శనివారంరాత్రి తిరుమలలో వివాహం చేసుకొని ఆదివారం వినుకొండకు తిరుగుప్రయాణం అయిన ఈ బృందంలో వధూవరులు గాయాలతో బయటపడింది. సంఘటనా స్థలం వద్ద ప్రమాద దృశ్యాలు భీతావహంగా మారాయి. పెళ్ళికొడుకు కొత్తమాసు వేణుగోపాల్ అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. పెళ్ళికుమార్తె మధులత బెంగళూరు వాసి.
News Posted: 22 November, 2009
|