వైభవంగా పద్మావతీ పుష్పయాగం
తిరుచానూరు : శ్రీ పద్మావతి అమ్మవారికి ఆదివారం సాయంత్రం పుష్పయాగాన్ని అత్యంత భక్తి ప్రపత్తుల మధ్య శాస్త్రోక్తంగా నిర్వహించారు. తిరుచానూరులోని అమ్మవారి ఆలయంలో సాయంత్ర 5 నుంచి 7 గంటల మధ్య వేదమంత్రాలు, హిందూ మతానుసారం అర్చకులు ఘనంగా నిర్వహించారు. ఈ పుష్పయాగానికి సుమారు 8 మెట్రిక్ టన్నుల పుష్పాలను వినియోగించారు. సంపంగి, చామంతి, గులాబీ, లిల్లీ, తులసి, సుగంధ జాజి, తామర, కలువ, మనోరంజితం, బిల్వం, పన్నీరు ఆకులు, ధావనం, మల్లి, కనకాంబరం, గన్నేరు, మొగిలి తదితర 18 రకాల సుగంధ పుష్పాలు, పత్రాలను అమ్మవారి పుష్పయాగంలో వినియోగించారు.
అంతకు ముందు అమ్మవారి ఉత్సవ విగ్రహానికి స్నపన తిరుమంజనం కార్యక్రమాన్ని ఆలయం ముఖమండపం వద్ద ఆలయ పూజారులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం బుట్టలతో పువ్వులను ఆస్థానం మండపం నుంచి అమ్మవారి ఆలయం వరకూ ప్రదర్శనగా తీసుకువచ్చారు. సుమారు రెండు వందల మంది దంపతుల జంటలు ఈ పుష్పయాగంలో పాల్గొన్నారు. ఒక్కొక్క జంట 516 రూపాయలు ఆలయానికి చెల్లించి పుష్పయాగం టిక్కెట్లు కొనుగోలు చేశారు. పుష్పయాగంలో పాల్గొన్న దంపతులకు ఐదు గ్రాముల వెండి డాలర్, అంగవస్త్రం, బ్లౌజ్ పీస్, రెండేసి లడ్డూలు, వడలతో బహుమతి ప్యాకెట్లను ఆలయం తరఫున అందజేశారు.
శ్రీ పద్మావతీ అమ్మవారి పుష్పయాగంలో టిటిడి ఈఓ ఐవైఆర్ కృష్ణారావు, సివి అండ్ ఎస్ఓ పివిఎస్ రామకృష్ణ, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ ఈఓ టిఎపి నారాయణ, అదనపు సివి అండ్ ఎస్ఓ శివకుమార్ రెడ్డి, ఉద్యానవనం సూపరింటెండెంట్ శ్రీనివాస్, పద్మావతీ అమ్మవారి దేవస్థానం ఎఇఓ నారాయణ చెట్టి, ఇతర ఆలయం అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
News Posted: 23 November, 2009
|