84 జంటలకు షష్టిపూర్తి
విశాఖపట్నం : సాయిబాబా 84వ జన్మదినం సందర్భంగా విజయనగరం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన 84 జంటలకు మేళతాళాలు, బాజాభజంత్రీల నడుమ గాజువాక కేటీబీ కళ్యాణ మండపంలో షష్టిపూర్తి మహోత్సవం అంగరంగం వైభవంగా జరిగింది. గొంతెనవానిపాలెం సాయిబాబా భజనమండలి ప్రతినిధులు ఈ సామూహిక షష్టిపూర్తి మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు మూడువేల మంది సాయి భక్తులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. 24 సంవత్సరాల క్రితం సామూహిక షష్టిపూర్తి కార్యక్రమం పుట్టపర్తిలో జరిగిందని భజనమండలి ప్రతినిధి జి.వి.వి.నర్సింహం తెలిపారు. భజన మండలిలను సమర్థవంతంగానూ, విజయవంతంగానూ నిర్వహిస్తున్న పలువురు సభ్యులను ఈ సందర్భంగా సన్మానించారు. ఈ షష్టిపూర్తి మహోత్సవంలో జీ తెలుగు సరిగమపా విజేత మేఘన చక్కని గీతాలను ఆలపించి అందరినీ అలరించారు.
News Posted: 24 November, 2009
|