వైభవంగా కలశజ్యోతి ఉత్సవం
విజయవాడ : ఇంద్రకీలాద్రిలో కొలువైయున్నశ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో భవానీ దీక్షల సందర్భంగా మార్గశిర పౌర్ణమిని పురస్కరించుకుని నగరంలో కలశజ్యోతి ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఇవో ఎన్ విజయకుమార్ జ్యోతిని వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. గురు భవానీలు కొందరు తమ శిష్యులతో వచ్చి జ్యోతులను పట్టుకుని కనకదుర్గమ్మకు జేజేలు పలికారు. దుర్గమ్మా, మమ్మేలు మాయమ్మా అంటూ అమ్మవారికి శరణు ఘోష పలుకుతూ జ్యోతులను పట్టుకున్నారు. ప్రత్యేకంగా అలంకరించిన ట్రాలీపై అమ్మవారి ఉత్సవ మూర్తిని ఉంచి అర్చనలు చేశారు. వేద పండితులు, అర్చకులు అమ్మవారికి శాంతి మంత్రాలు పఠించారు. అనంతరం మంగళవాయిద్యాలు, వేద మంత్రాల, భక్తుల శరణ ఘోష మధ్య ఊరేగింపు బయలుదేరింది. రధం గాంధీనగర్, ఏలూర్ రోడ్డు, బందరు రోడ్డు మీదుగా పాత బస్తీనీ నుంచి ఇంద్రకీలాద్రిపై కొలువున్న అమ్మవారి సన్నిధికి చేరుకుంది. రధం అలంకరణకు ఇంద్రకీలాద్రి అర్చక స్వాములతో పాటు శ్రీకాళహస్తి నుంచి అర్చకులను కూడా రప్పించారు. అఖండ జ్యోతిని అమ్మవారి అవతారంగా భావిస్తారని దుర్గ గుడి ప్రధాన అర్చకులు యనమండ్ర మల్లేశ్వరశాస్త్రి తెలిపారు. అందుకే భవానీ దీక్షల విరమణలకు ముందుగా కలశంలో ఉంచిన జ్యోతికి పూజలు జరుపుతారన్నారు.
News Posted: 3 December, 2009
|