విశాఖపట్నం : తూర్పు నావికాదళం నేవీ దినోత్సవం సందర్భంగా సాగరతీరంలోని ఆర్ కే బీచ్ ను వేదికగా చేసుకుని తన సత్తాను చాటుకోవడానికి సర్వసన్నద్ధమైంది. ఈ సందర్భంగా నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ ను మళ్ళిస్తున్నట్లు ట్రాఫిక్ మరియు సెక్యూరిటీ డీసీపీ పీ.విశ్వప్రసాద్ తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 7 గంటల వరకు ట్రాఫిక్ మళ్ళింపు కొనసాగుతుందన్నారు. బీచ్ రోడ్డులోని ఎన్టీఆర్ విగ్రహం నుంచిపాండురంగాపురం (స్పెన్సర్) జంక్షన్ వరకు మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 7 గంటల వరకు నేవీ పాస్ లు ఉన్న వాహనాలను మాత్రమే అనుమతించనున్నట్లు డీసీపీ తెలిపారు. సందర్శకుల వాహనాలను సిరిపురం జంక్షన్ నుంచి పార్క్ హోటల్ మీదుగా బీచ్ రోడ్డులోని పాండురంగాపురం జంక్షన్ వరకు అనుమతిస్తారు. తాజ్ హోటల్ డౌన్ మరియు కలెక్టర్ ఆఫీసు డౌన్ గుండా వచ్చే సందర్శకుల వాహనాలను బీచ్ రోడ్డులోని ఎన్టీఆర్ జంక్షన్ వరకు మాత్రమే అనుమతిస్తారు.
శత్రువును ఎదుర్కోవడంలో మన నౌకాదళానికి ఉన్న అపారమైన శక్తి సామర్థ్యాలను ఈ నేవీ దినోత్సవం సందర్భంగా ప్రదర్శించనున్నారు. 1971లో భారత్ - పాకిస్తాన్ ల మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో డిసెంబర్ నాలుగున భారత్ నావికాదళం కరాచీ హార్బర్ పై దాడులకు తెగబడింది. యుద్ధంలో భాగంగా డిసెంబర్ నాలుగున పాకిస్తాన్ జలాంతర్గామి 'ఘాజీ' విశాఖ తీరానికి సమీపంలోకి వచ్చింది. దీనిని పసిగట్టిన భారత యుద్ధనౌకలు దానిని ధ్వంసం చేశాయి. అనంతరం భారత్ సేనలు యుద్ధంలో విజయం సాధించాయి. ఆ విజయానికి గుర్తుగా అప్పట్నుంచి ప్రతి సంవత్సరం డిసెంబర్ నాలుగున తూర్పు నావికాదళం వేడుకులను నిర్వహిస్తూ వస్తోంది. శుక్రవారం సాయంత్రం 4 గంటల నుంచి బీజ్ వద్ద ప్రారంభమయ్యే విన్యాసాల్లో ఇరవై యుద్ధ నౌకలు, 16 యుద్ధ విమానాలు, ఒక జలాంతర్గామి పాల్గొంటాయి. సూర్యాస్తమయ సమయానికి సాగరంలోని అన్ని యుద్ధ నౌకలు దీపాలంకరణ వెలుగుల్ని ప్రసరింపజేయనున్నాయి. ఈ కార్యక్రమానికి గవర్నర్ ఎన్.డి.తివారీ ముఖ్య అతిధిగా హాజరుకానున్నారు. బీచ్ వద్ద ప్రారంభమయ్యే విన్యాసాలను తిలకించడానికి వేల సంఖ్యలో ప్రజలు హాజరుకానున్న దృష్ట్యా దానికి తగ్గ ఏర్పాట్లను పూర్తి చేసినట్లు యంత్రాంగం తెలిపింది.