ఏయూ 76వ స్నాతకోత్సవం
విశాఖపట్నం : ఆంధ్రాయూనివర్శిటీ 76వ స్నాతకోత్సవం శనివారం జరగనున్న నేపథ్యంలో విస్తృత ఏర్పాట్లు చేసినట్లు ఏయూ ఉపకులపతి ఆచార్య బీల సత్యనారాయణ తెలిపారు. రాష్ట్ర గవర్నర్ ఎన్ డీ తివారి కులపతి హోదాలో ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తారని, ముఖ్యఅతిథిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కె.జి.బాలకృష్ణన్ హాజరుకానున్నట్లు తెలిపారు. అలాగే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, పలువురు న్యాయమూర్తులు విచ్చేయనున్నారని, ఇప్పటికే న్యాయమూర్తులు మీనాకుమారి, ధర్మారావులు వస్తున్నట్లు సమాచారం అందిందన్నారు. న్యాయ విభాగం నుంచి ఎక్కువ మంది ప్రముఖులు వస్తున్నందున వారికి ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బాలకృష్ణన్ కు డాక్టర్ ఆఫ్ లా ప్రధానం చేయనున్నామని, గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి కళాప్రపూర్ణ, జీఎంఆర్ అధినేత మల్లిఖార్జునరావు, పాండిచ్చేరి లెఫ్ట్ నెంట్ గవర్నర్ ఇక్బాల్ సింగ్ కు గౌరవ డాక్టరేట్స్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 238 మందికి పీ హెచ్ డీ, 62 మందికి ఎంఫిల్ డిగ్రీలు, పది మందికి బంగారు పతకాలు ప్రధానం చేయనున్నట్లు వివరించారు. పీహెచ్ డీ పట్టా తీసుకోనున్న 170 మంది పురుషులలో ఆర్ట్స్ విభాగం నుంచి 36 మంది, సైన్స్ లో 50, కామర్స్ అండ్ మేనేజ్ మెంట్ లో 22, ఇంజనీరింగ్ లో 30, కెమికల్ ఇంజనీరింగ్ లో ఐదుగురు, ఎడ్యుకేషన్ లో ఏడు, 'లా' లో ఐదుగురు, ఫార్మసీలో 14 మంది ఉన్నారు. హీహెచ్ డీ పట్టా తీసుకుంటున్న మహిళలలో ఆర్ట్స్ నుంచి 22 మంది, సైన్స్ లో 25, కామర్స్ అండ్ మేనేజ్ మెంట్ లో ఆరుగురు, ఇంజనీరింగ్ లో ఒకటి, ఎడ్యుకేషన్ లో ఐదుగురు, న్యాయ విద్యలో నలుగురు, ఫార్మసీలో ఐదు మంది ఉన్నారన్నారు.
గత ఏడాది జనవరి 16న 75వ స్నాతకోత్సవాన్ని నిర్వహించామని చెబుతూ రానున్న ఆరు నెలల్లో మరొకటి నిర్వహిస్తామని వీసీ వివరించారు. గతంలో ఒకే ఏడాది రెండు స్నాతకోత్సవాలు నిర్వహించిన సందర్భాలు ఉన్నాయని పేర్కొన్నారు. కులపతి హోదాలో గవర్నర్ నాలుగు స్నాతకోత్సవాలకు రాలేదనీ, ఈ పర్యాయం ఆయన వస్తున్నందుకు సంతోషంగా ఉందని బీల సత్యానారాయణ అన్నారు. సుమారు రెండున్నర గంటలకు పైగా జరిగే ఈ కార్యక్రమాన్ని అందరూ చూసేందుకు వీలుగా నాలుగు ఎల్ సీడీలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. గురువారం సెనేట్ హాలులో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో స్నాతకోత్సవానికి సంబంధించిన పై వివరాలను వెల్లడించారు.
News Posted: 4 December, 2009
|