'రాష్ట్రమంతా భజగోవిందం'
హైదరాబాద్ : ముక్కోటి వైకుంఠ ఏకాదశి రోజు ఈ నెల 28న రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లోనూ భజగోవిందం కార్యక్రమం నిర్వహించాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించిందని దేవాదాయ శాఖ మంత్రి గాదె వెంకటరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు గాను అధికారులతో సమన్వయ కమిటీ ద్వారా ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నట్లు మంత్రి బుధవారంనాడు హైదరాబాద్ లో స్పష్టం చేశారు. టిటిడి కల్యాణ మండపాలను సమీపంలోని దేవాలయాల పరిధిలోకి తెచ్చే విషయమై చర్చించినట్లు తెలిపారు.
హిందూ ధర్మ ప్రచారానికి రాయలసీమ, తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల్లో మూడు లోక కల్యాణ రథాలను నడపాలని నిర్ణయించినట్లు మంత్రి గాదె తెలిపారు. పంచలోహ విగ్రహాలు తదితర దేవాలయాల ఆస్తుల పరిరక్షణ కోసం ప్రత్యేక రక్షణ దళాన్ని ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు చెప్పారు. వైకుంఠ ఏకాదశి, నూతన సంవత్సరం సందర్భంగా తిరుమలలో భక్తుల దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.
News Posted: 23 December, 2009
|