బిజెపి కార్యాలయంపై దాడి
విజయవాడ : నగరంలోని బిజెపి కార్యాలయంపై సమైక్యాంధ్ర వాదులు మంగళవారం ఉదయం దాడి చేశారు. బిజెపి నాయకుడు కంభంపాటి హరిబాబు నిర్వహించే మీడియా సమావేశాన్ని వారు అడ్డుకున్నారు. కార్యాలయంలోని కుర్చీలను ఎత్తి కొట్టి, ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. ఒక వైపున సమైక్యాంధ్ర ఉద్యమం జరుగుతుండగా 'జై ఆంధ్ర' అంటూ విజయవాడలో బిజెపి ఉద్యమా సిద్ధం అవడంతో సమైక్యవాదులు ఈ చర్యకు పూనుకున్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ఆందోళనకారులు నినాదాలు చేశారు. తమ ప్రాంత మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరించిన ఎవరికైనా ఇలాంటి గతే పడుతుందని బిజెపి నాయకులతో ఆందోళనకారులు వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం ఏర్పడింది.
రాష్ట్రంలోని తెలుగు ప్రజలంతా అన్నదమ్ముల్లా కలిసిమెలసి ఉండాలని తాము కోరుకుంటుంటే మధ్యలో వచ్చి జై ఆంధ్ర ఉద్యమం అంటూ ఎందుకు వచ్చారంటూ ఆందోళనకారులు బిజెపి నాయకులను నిలదీశారు. జై తెలంగాణ అంటూ అక్కడ ఉద్యమాలు చేస్తున్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండారు దత్తాత్రేయ ఇక్కడ సమైక్యాంధ్రలో చిచ్చుపెట్టాలని చూస్తున్నాడని ఆందోళనకారులు నిప్పులు చెరిగారు. దత్తాత్రేయకు 'సన్మానం' చేయాలనే తాము ఈ దాడికి వచ్చామని అయితే అతను తప్పించుకున్నారని వారన్నారు. పొట్టి శ్రీరాములు లాంటి మహనీయుల త్యాగఫలంగానే సమైక్యాంధ్ర రాష్ట్రం ఏర్పడిందని, అలాంటి సమైక్యతను విచ్ఛిన్నం చేయాలని యత్నిస్తే బుద్ధి చెబుతామంటూ ఆందోళనకారులు హెచ్చరించారు.
దొంగ నిరాహార దీక్షలు చేసిన కేసీఆర్ తన స్వార్థం కోసమే రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని చూస్తున్నాడని ఆందోళనకారులు దుయ్యబట్టారు. అసలు రాష్ట్రం ఎందుకు విడిపోవాలని వారు ప్రశ్నించారు. సమైక్యాంధ్ర ఉద్యమానికి జెండా ఎంజెండా లేదంటూ కేసీఆర్ అవాకులు చెవాకులు పేలుతున్నాడని కలిసి ఉందామన్నదే తమ ఎజెండా అని, సమైక్యాంధ్ర అనేదే తమ జెండా అని వారన్నారు.
News Posted: 29 December, 2009
|