విడిపోతేనే బెస్ట్: బొత్స
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోతేనే లాభాలు ఎక్కువ అని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజనకు తాను సానుకూలం అన్నారు. విజయవాడ రాజధానిగా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైతే ఆ ప్రాంతాలకూ ఎన్నో ప్రయోజనాలు చేకూరతాయని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ఒకే భాష మాట్లాడేవారు విడిపోతే నష్టం అనుకోవడం పొరపాటని ఆయన అన్నారు. విడిపోతే మున్ముందు రెండు తెలుగు భాషా రాష్ట్రాలూ గణనీయమైన అభివృద్ధి సాధించే అవకాశాలు మెండుగా ఉంటాయన్నారు. తెలుగు భాష మాట్లాడే రెండు రాష్ట్రాలు ఉంటే కేంద్రంలో కూడా మరింత బలపడతామన్నారు. శ్రీకృష్ణ కమిటీకి తాను రాష్ట్ర విభజన జరిగితే ఒనగూరే మేళ్ళ గురించే వివరిస్తానన్నారు. అయితే, ఈ విషయంలో తుది నిర్ణయం మాత్రం తమ పార్టీ అధిష్టానానిదే అన్నారు. అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తాను క్రమశిక్షణ గల పార్టీ సైనికుడిగా అనుసరిస్తానని చెప్పారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకించడం అర్థరహితమని మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. విడిపోతే నష్టపోతామంటూ కొందరు చేస్తున్న వాదనను కేవలం ఊహాగానమే అని ఆయన కొట్టిపారేశారు.
News Posted: 26 February, 2010
|