అసెంబ్లీ బరిలోకి పోసాని?
గుంటూరు: ఎన్నికల వేడి ఊపందుకుంటున్న ప్రస్తుత తరుణంలో తెలుగు సినీరంగంలో పేరు పొందిన ఇద్దరు ప్రముఖులను జిల్లా ఎన్నికల బరిలో దింపేందుకు ప్రజారాజ్యం పార్టీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలుగు సినిమాలో దర్శకుడిగా, నటుడిగా మంచి స్థాయికి ఎదిగినా స్వస్థలంలో మిత్రులు, బంధువులతో సంబంధ, బాంధవ్యాలు కొనసాగిస్తున్న పోసానిని పొన్నూరు అసెంబ్లీ అభ్యర్థులుగా రంగంలోకి దించుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఏ విషయాన్నైనా కుండ బద్దలు కొట్టినట్లు ముక్కు సూటిగా మాట్లాడే నైజంతో పైర్ బ్రాండ్ పోసాని స్వస్థలం పెదకాకాని. పొన్నూరు నియోజకవర్గం నుండి పిఆర్పీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఎన్.ఆర్.ఐ. తాళ్ళ వెంకటేష్ యాదవ్, కోటా శ్రీనివాసరావు తదితరులు పోటీలో ఉన్నప్పటికీ అధిష్టానం ఆచితూచి వ్యవహరించి పోసానివైపే మొగ్గు చూపింది. మొన్నటి వరకు తాడికొండ నియోజకవర్గ పరిధిలో ఉన్న పెదకాకాని మండల పునర్విభజనలో పొన్నూరు కూడా కలియడం పోసానికి లాభించింది. తెలుగు చిత్రసీమలో హాస్యనటుడిగా ప్రేక్షకులలో తనదైన చెరగిని ముద్ర వేసుకున్న డా.బ్రహ్మానందం స్వస్థలం సత్తెనపల్లి. ఆయన బాల్యం, హైస్కూల్ విద్యాభ్యాసం సత్తెనపల్లిలోనే జరిగింది. ఆ తర్వాత లెక్చరర్ గా పనిచేస్తూ సినీ రంగంలోకి ప్రవేశించి అంచెలంచెలుగా ప్రముఖ హాస్యనటులుగా ఎదిగారు. కేంద్ర ప్రభుత్వం ఆయనకు ఇటీవలే పద్మశ్రీ ప్రకటించింది. చిరంజీవికి వీరాభిమానిగా పేరుగాంచిన బ్రహ్మానందం ప్రజారాజ్యం పార్టీ తరఫున సత్తెనపల్లి అసెంబ్లీ బరిలోకి దిగడం ఖాయమైంది. జిల్లాలో పిఆర్పి పార్టీ తరఫున ఇద్దరు సినీ ప్రముఖులు అసెంబ్లీ బరిలోగి దిగడం పట్ల ప్రజారాజ్యం వర్గాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.
News Posted: 25 March, 2009
|