దేవదేవుని సేవలో వైఎస్
తిరుపతి : తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామివారని ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సోమవారం ఉదయం దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి రాకను పురస్కరించుకొని దేవస్థానం అర్చకులు, అధికారులు శ్రీవారి ఆలయం ముందు ఆలయ మర్యాదల (ఇష్టిపాకల్)తో సగౌరవంగా ఆహ్వానించారు.
స్వామివారని వైఎస్ దర్శించుకున్న అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్, టిటిడి కార్యనిర్వహణాధికారి కె.వి.రమణాచారి స్వామివారి ప్రసాదం, సాహిత్యం, స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. అనంతరం రంగనాయకుల మండపం వద్ద ఆలయం వేద పండితులు వేద మంత్రోచ్ఛారణలతో ముఖ్యమంత్రి వైఎస్ ను ఆశీర్వదించారు. వైఎస్ తో పాటు మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గల్లా అరుణ కుమారి, గాదె వెంకటరెడ్డి ఉన్నారు. టిటిడి బోర్డు సభ్యులు చేవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అల్లూరు సుబ్రహ్మణ్యం, డాక్టర్ అంజయ్య, కాలె యాదయ్య, సిహెచ్. సత్యనారాయణ, ఆలయం ప్రత్యేకాధికారి ఎ.వి. ధర్మారెడ్డి, సివి అండ్ ఎస్ ఓ పివిఎస్ రామకృష్ణ, ఆలయం డిప్యూటీ ఈఓ సిద్దయ్య, ఆలయం పేష్కార్లు మురళి, నాగారెడ్డి తదితరులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
అలాగే, ముఖ్యమంత్రి వైఎస్ సోమవారం ఉదయం తిరుచారనూరులోని శ్రీ పద్మావతి అమ్మవారిని కూడా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. టిటిడి చైర్మన్ డి.కె.ఆదికేశవులు నాయుడు అమ్మవారి ప్రసాదం, చిత్రపటాన్ని ముఖ్యమంత్రికి అందజేశారు.
రెండోసారి వరుసగా ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టి తొలిసారిగా సోమవారం ఉదయం తిరుమల వచ్చిన వైఎస్ రాజశేఖరరెడ్డిని టిటిడి ఎంప్లాయీస్ యూనియన్ ఘనంగా సత్కరించింది. తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో జరిగిన ఈ సన్మాన కార్యక్రమానికి మంత్రులు పి. రామచంద్రారెడ్డి, గల్లా అరుణ కుమారి, గాదె వెంకటరెడ్డి, టిటిడి చైర్మన్ డికె ఆదికేశవులు నాయుడు, టిటిడి బోర్డు సభ్యులు, టిటిిడ సంయుక్త కార్యనిర్వహణాధికారి వి. శేషాద్రి, తిరుపతి ఎంపి చింతా మోహన్, యూనియన్ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.
News Posted: 15 June, 2009
|