స్తంభించిన రుయా సేవలు
తిరుపతి : రుయా ఆస్పత్రి లో జూనియర్ డాక్టర్లు చేస్తున్న సమ్మెతో వైద్యం అందక రోగులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. తమపై దాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ వారు సమ్మె చేస్తున్నారు. ఇది మూడు రోజులుగా కొనసాగుతుండడంతో రుయా ఆస్పత్రిలో వైద్య సేవలు స్తంభించాయి. బుధవారం గోపీ అనే వ్యక్తి తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దాంతో గోపీ బంధువులు డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే రోగి మరణించాడని డాక్టర్లపై దాడికి దిగారు. అంతేకాక ఆస్పత్రి ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్లకు, మృతుని బంధువులకు వాగ్వివాదం జరిగింది. పోలీసుల రాకతో గొడవ సద్దుమణిగినప్పటికీ తమకు పూర్తి భద్రత కల్పిస్తేనే విధులకు హాజరవుతామని జూనియర్ డాక్టర్లు పేర్కొన్నారు.
News Posted: 11 July, 2009
|