తెలంగాణ ఎన్నారై ఖండన కాలిఫోర్నియా : తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావును పోలీసులు అరెస్ట్ చేయడాన్ని తెలంగాణ ఎన్నారైలు ముక్తకంఠంతో ఖండించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రజాస్వామ్య బద్ధంగా ఆమరణ నిరాహార దీక్ష చేందుకు దీక్షా వేదిక వద్దకు వెళుతున్న కేసీఆర్ ను ఆదివారం ఉదయం పోలీసులు మధ్యలోనే అటకాయించి అరెస్ట్ చేయడం పట్ల తెలంగాణ ఎన్నారై విజయ్ చవ్వ ఒక ప్రకటనలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ అసంతృప్తిని, నిరసనను శాంతియుతంగా, ప్రజాస్వామ్య విధానంలో వ్యక్తం చేసే హక్కు ప్రతి పౌరుడికీ ఉందని ఆయన పేర్కొన్నారు. పౌరుల హక్కులకు భంగం కలిగించే విధంగా వ్యవహరించవద్దని విజయ్ చవ్వ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఆదివారం ఉదయం బే ఏరియాలో ప్రత్యేకంగా సమావేశమైన అనేక మంది ఎన్నారైలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చర్యను తీవ్రంగా ఖండించారన్నారు. శాంతియుతంగా నిర్వహించే ఆందోళనలకు ఆటంకం కలిగించవద్దని ప్రభుత్వానికి సూచించారని విజయ్ చవ్వ పేర్కొన్నారు. సున్నితమైన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమిస్తున్న నాయకు తెరాస నాయకులు, శ్రేణులు శాంతి, సహనం, సంయమనం పాటించాలని తెలంగాణ ఎన్నారైలు విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్యయుతంగా, శాంతి మార్గంలో రాష్ట్ర సాధన కోసం అవసరమైన మార్గాలను ఎంచుకోవాలని ఈ సందర్భంగా తెలంగాణ ఎన్నారైల ప్రత్యేక సమావేశం సూచించిందని విజయ్ చవ్వ తన ప్రకటనలో తెలిపారు.
News Posted: 30 November, 2009
|