ఐపిఎల్ పై ముగిసిన చర్చలు
న్యూఢిల్లీ: వచ్చే నెలలో జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్ కు అనుమతి ఇవ్వాలా, వద్దా? అనే విషయమై చర్చించేందుకు కేంద్ర హోం మంత్రి పి.చిదంబరం ఉననతస్థాయి భద్రతా సిబ్బందితో చర్చలు జరిపారు. ఇంటెలిజెన్స్ బ్యూరో అధిపతి, జాతీయ భద్రతా వ్యవహారాల సలహాదారు, గూఢచారి సంస్థ 'రా' ప్రధానాధికారి ఈ సమావేశంలో పాల్గొన్నారు. తమ పోలీసు శాఖాధిపతుల వినియోగార్ధం కనీసం ఐదు లేక ఆరు కంపెనీల (500-600 సిబ్బంది) పారా మిలిటరీ దళాలను కేటాయిస్తే, ఐపిఎల్ మ్యాచ్ ల నిర్వహణకు అభ్యంతరం లేదని, తమిళనాడు మినహా అన్ని రాష్ట్రాలు హోం శాఖకు తెలియజేశాయని అదికార వర్గాలు వెల్లడించాయి. తమ రాష్ట్రంలో మ్యాచ్ ల నిర్వహణకు ససేమిరా వీల్లేదని తమిళనాడు ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. ఐపిఎల్ సవరించిన షెడ్యూలుకు సమాధానం కోరిన మీదట రాష్ట్ర ప్రభుత్వాలు పై విధంగా ప్రతిస్పందించాయి. కేంద్ర భద్రతా దళాల సహాయంతో మాత్రమే పోటీలను ప్రశాంతంగా నిర్వహించడం సాధ్యమవుతుందని రాష్ట్రాలు అభిప్రాయపడినట్టు హోం శాఖ సీనియర్ అధికారులు చెప్పారు.
News Posted: 13 March, 2009
|