న్యూఢిల్లీ: ముఖేష్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ చరిత్ర సృష్టించింది. కృష్ణ-గోదావరి బేసిన్ నుండి గ్యాస్ ఉత్పత్తిని బుధవారం నుండి ప్రారంభించింది. సహజ వాయువు కృష్ణ గోదావరి బేసిన్ నుండి మనకు అందుబాటులోకి వచ్చింది. ఈ మహత్కార్యం కేవలం 7 ఏళ్లలో సంభవమయ్యింది. భారత ఇంధన పరిస్థితిలో గణనీయమైన మార్పు వస్తుంది. రోజుకు 2.5 మిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ ఉత్పత్తి జరుగనుందని పెట్రోలియం సెక్రటరీ ఆర్ ఎస్ పాండే తెలిపారు. రిలయన్స్ గ్యాస్ కారణంగా భారత ఆయిల్ బిల్ లో ఏడాదికి 9 బిలియన్ డాలర్లు మిగులుతుందని ఆయన తెలిపారు.
'సహజ వాయువు కోసం బుధవారం సాయంత్రం 5 గంటల నుండి డ్రిల్లింగ్ ప్రారంభమైంది. ఆ గ్యాస్ గురువారం ఉదయానికి కాకినాడ వద్ద నున్న గాడిమొగ గ్యాస్ స్టేషన్ కు చేరింది' అని కంపెనీ ప్రతినిధి తెలిపారు. కెజి డి6 బావిలోని గ్యాస్ పరిణామం పూర్తయ్యే నాటికి 42 బిలియన్ డాలర్ల గ్యాస్ అమ్మకాలు జరుగన్నాయి. అందులో ప్రభుత్వాదాయం 14 బిలియన్ డాలర్లుగా ఉంటుందని పాండీ తెలిపారు. గ్యాస్ ఉత్పత్తి ప్రారంభమైందని మాత్రమే రిలయన్స్ అధికార ప్రతినిధి తెలిపారు. మిగిలిన వివరాలు త్వరలో కంపెనీ ప్రకటించనుందని ఆయన తెలిపారు. గ్యాస్ నిక్షేపాలు కనుగొన్న తర్వాత గ్యాస్ ఉత్పత్తి ప్రారంభం కావడానికి ప్రపంచ వ్యాప్తంగా 9 ఏళ్లపాటు పడుతుంది. అందుకు భిన్నంగా రిలయన్స్ సంస్థ 7 ఏళ్లలోనే గ్యాస్ ఉత్పత్తిని ప్రారంభించడం ఒక ప్రపంచ రికార్డు.