కుల వోట్లపై పిఆర్పీ ధీమా
హైదరాబాద్ : మొదటి దశ ఎన్నికలకు ప్రచారం గడువు ముగియబోతున్నందున కులాల ప్రాతిపదికపై తమకు వోట్లు సమీకృతం కాగలవని ప్రజారాజ్యం పార్టీ (పిఆర్పీ) నాయకత్వం ఆశిస్తున్నది. ప్రతి నియోజకవర్గంలో కులాల సమీకరణాలపై పిఆర్పీ నిర్వహించిన సర్వే ఆధారంగా సామాజిక న్యాయమే తమను ఎన్నికలలో గెలిపిస్తుందనే ధీమాతో పార్టీ ఉన్నది. ఈ సర్వే ఆధారంగా పిఆర్పీ నాయకత్వం ఏప్రిల్ 16న పోలింగ్ జరిగే 154 అసెంబ్లీ సెగ్మెంట్లలో 60 నుంచి 70 వరకు సీట్లు తమకు రాగలవని ఆశిస్తున్నది. వాటిలో 20 నుంచి 25 వరకు సీట్లను పార్టీ ఉత్తరాంధ్ర ప్రాంతంలో కైవసం చేసుకోగలదు. మిగిలిన 40 నుంచి 45 వరకు సీట్లను 119 సీట్లు ఉన్న తెలంగాణ ప్రాంతంలో గెలుచుకోగలదని పార్టీ నాయకులు సూచిస్తున్నారు.
154 అసెంబ్లీ స్థానాలలో ప్రతి మండల కేంద్రంలో శాంపిల్ సర్వే నిర్వహించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే, తెలంగాణ సెంటిమెంట్, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, కాంగ్రెస్, మహా కూటమి సాంప్రదాయక వోటు బ్యాంకు వంటి కీలక అంశాలను ప్రశ్నావళిలో చేర్చలేదు. దీనితో ఈ సర్వే ఫలితాలను తేల్చడం కొద్దిగా కష్టమైంది. ఈ సర్వేకు సంబంధించిన ఇతర వివరాలను వెల్లడించలేదు. పార్టీ నుంచి ఇటీవల జరిగిన నిష్క్రమణలు, పార్టీ నాయకత్వంపై పరకాల ప్రభాకర్ చేసిన ఆరోపణలు ఎన్నికలలో పార్టీ అవకాశాలపై వ్యతిరేక ప్రభావం చూపగలవని ప్రజారాజ్యం పార్టీ నాయకులు భయపడుతున్నారు. టిక్కెట్లు అమ్ముకున్నారనే ఆరోపణలు కూడా విద్యావంతులు, మధ్య తరగతి వోటర్లలో పార్టీ ప్రతిష్ఠకు హాని కలిగంచాయని కూడా వారు భావిస్తున్నారు. ఇది ఇలా ఉండగా, పార్టీ ప్రతిష్ఠను దెబ్బ తీసేందుకు తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు ఎన్. చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి కుట్ర పన్నారని ప్రజారాజ్యం పార్టీ ఉపాధ్యక్షుడు టి. దేవేందర్ గౌడ్ ఆరోపించారు.
News Posted: 14 April, 2009
|