పాలకొల్లులో చిరు వెనుకంజ!
ఏలూరు : ప్రజారాజ్యం పార్టీ (పిఆర్పీ) అధ్యక్షుడు చిరంజీవి స్వయంగా పోటీ చేస్తున్న కారణంగా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు శాసనసభ నియోజకవర్గంపై అందరి కళ్ళూ కేంద్రీకృతమయ్యాయి. రాజకీయ నాయకుడుగా మారిన నటుడు చిరంజీవికి ఇది స్వస్థలమే అయినప్పటికీ విజయం ఏమాత్రం తేలిక కాదు. పాలకొల్లు నియోజకవర్గం తెలుగు దేశం పార్టీ (టిడిపి)కి పెట్టని కోట. మూడు సార్లుగా పాలకొల్లుకు టిడిపి ప్రాతినిధ్యం వహిస్తున్నది. అంతే కాకుండా సిట్టింగ్ శాసనసభ్యుడు సిహెచ్. సత్యనారాయణకు మంచి పేరు ప్రతిష్ఠలు ఉన్నాయి. తాము బలమైన పోటీ ఇవ్వనున్నట్లు సంకేతాలు పంపడానికై పాలకొల్లులో పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో రోడ్ షోను నిర్వహించాలని టిడిపి నాయకులు యోచిస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిగా బంగారు ఉషారాణిని నిలబెట్టింది. ఆర్య వైశ్య కులానికి చెందిన ఉషారాణి మాజీ మునిసిపల్ చైర్ పర్సన్. ఈ నియోజకవర్గంలో కాపు కులానికి చెందిన వారెవరినీ పోటీ చేయించకపోవడం బహుశా నాలుగు దశాబ్దాలలో ఇది మొదటిసారి కావచ్చు. ఈ నియోజకవర్గంలో కాపు కులస్థుల ప్రాబల్యం ఉన్న దృష్ట్యా ఆ కులం నుంచే అభ్యర్థులను నిలబెట్టడం శ్రేయస్కరమని ఇంత వరకు అన్ని ప్రధాన పార్టీలు భావిస్తూ వచ్చాయి. ఉషారాణికి 15 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది. ఆమె పార్టీలో వివిధ హోదాలలో సేవలు అందించారు. అయితే, చిరంజీవి శిబిరం గెలుపు తమదేననే ధీమాతో ఉన్నది. పిఆర్పీ సీనియర్ నాయకుడు చేగొండి హరిరామ జోగయ్య నియోజకవర్గంలో పార్టీ ప్రచార బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే, వోటర్లు ఇంకా స్థిరంగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు కనిపించడం లేదు. మెగాస్టార్ చిరంజీవి ఎన్నికలలో గెలిచిన అనంతరం ఈ సీటుకు రాజీనామా చేయవచ్చుననే వదంతి సాగుతుండడం ఇందుకు కారణం.
Pages: 1 -2- News Posted: 13 April, 2009
|