రాజీవ్ మీనన్ తో అభి-ఐష్
అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్ దంపతులు ఇప్పుడు వరుస చిత్రాలకు కలిసే సంతకాలు చేస్తున్నారు. కలిసే పనిచేయబోతున్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరూ మణిరత్నం 'రావణ' చిత్రంలో కలిసి నటిస్తున్నారు. ఇప్పుడు రాజీవ్ మీనన్ తదుపరి చిత్రంలోనూ ఈ ఇద్దరూ పనిచేయబోతున్నారంటూ కథనాలు వినిపిస్తున్నాయి. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ అయిన రాజీవ్ మీనన్ 'ధున్' అనే చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. ఎరోస్ ఇంటర్నేషనల్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. జంట ఆస్కార్ అవార్డుల గ్రహీత ఎ.ఆర్.రెహమాన్ సంగీతం అందించబోతున్నారు.
అభిషేక్, ఐశ్వర్య ఇందులో మ్యుజిషియన్లుగా నటించనున్నారనీ, ఆ పోలిక మినహా గతంలో అమితాబ్ బచ్చన్, జయాబచ్చన్ కలిసి నటించిన 'అభిషేక్' చిత్రానికీ, 'ధున్' చిత్రానికీ ఎలాంటి పోలికలు ఉండవని సినీ వర్గాల భోగట్టా. 'ధున్' ఈ ఏడాది ఐశ్వర్య, అభిషేక కలిసి నటించబోతున్న మూడో చిత్రం కానుంది. మొదటిది మణిరత్నం చిత్రం కాగా, అభినయ్ దేవ్ దర్శకత్వంలో రూపొందనున్న చిత్రానికి కూడా ఈ జంట కమిట్ అయింది. ఇక ఐశ్వర్య చేతిలో మరిన్ని చిత్రాలు ఉన్నాయి. సంజయ్ లీలా భనాల్సీ దర్శకత్వంలో రూపొందనున్న చిత్రంలో హృతిక్ రోషన్ కు జంటగా ఆమె నటించనుంది. అక్షయ్ కుమార్ తో విపుల్ షా తీస్తున్న చిత్రంలోనూ ఆమె నటించాల్సి ఉంది. విశాల్ భరద్వాజ్, రీతుపర్నో సేన్ గుప్తా చిత్రాలు కూడా ఐష్ చేతిలో ఉన్నాయి. రజనీకాంత్ కథానాయకుడుగా శంకర్ ప్రతిష్ఠాత్మక చిత్రం 'యంతిరిన్'లోనూ ఐశ్వర్య నటిస్తోంది. ఈ చిత్రం శరవేగంగా నిర్మాణం కూడా జరుపుకొంటోంది. దీంతో ఈ ఏడాదంతా ఐశ్వర్య బిజీనే. వీటిలో కనీసం సగానికి సగం చిత్రాలైనా తన హబ్బీ అభిషేక్ తో నటించినవే అయితే ఆమెకు కూడా రిలీఫ్ గా ఉంటుంది. కలిసి విలువైన సమయం పంచుకునే అవకాశమూ దక్కుతుంది.
News Posted: 4 March, 2009
|