ఆసిన్ పై పోలీసు కేసు!
ఆసిన్ ఈమధ్య ఏదోరకంగా చిక్కుల్లో పడుతూనే ఉంది. కొద్దికాలం క్రితమే ఆసిన్ ఇంట్లో పనిచేసే పిల్ల కనబడటం లేదంటూ ఆమె తల్లి ఆసిన్ పై ఫిర్యాదు చేసింది. అయితే ఆ పిల్లే స్వయంగా పోలీస్ కమిషనర్ ముందుకు వచ్చి తల్లికి వ్యతిరేకం మాట్లాడటంతో ఆసిన్ ఆ కేసు నుంచి బయటపడింది. ఇప్పుడు మళ్లీ ఇదే తరహా సమస్యను ఆసిన్ ఎదుర్కొంటోంది. 'పోక్కిరి' సినిమా కోసం ఆసిన్ కు సహాయకుడుగా పనిచేసిన తన కుమారుడు ముత్తుకుమార్ ఆ తర్వాత ఆమెకు పనివాడుగా ముంబై వెళ్లాడనీ, కొద్దిరోజులుగా అతని జాడే లేదనీ, ఇందుకు ఆసిన్, ఆమె తండ్రి కారణమంటూ ముత్తుకుమార్ తల్లి సుధాలయ్ వడివు పోలీసు కమిషనర్ కు ఫిర్యాదు చేసింది. ఆసిన్ తండ్రి జోసఫ్ ను కలుసుకునేందుకు ఇటీవల తాను ముంబై వెళ్లాననీ, కొద్దిరోజుల్లో ముత్తుకుమార్ ను చెన్నై పంపుతానని ప్రామిస్ చేసి ఆ తర్వాత ఎన్నిసార్లు ఫోన్ చేసినా పట్టించుకో లేదని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. ఆసిన్ తండ్రి జోసఫ్ మాత్రం ఈ వాదనను తోసిపుచ్చారు.
ఆసిన్ చెన్నైలో ఉన్నప్పుడు ముత్తుకుమార్ ఇంటి పనులు చేసేవాడనీ, ముంబైకి ఆసిన్ షిఫ్ట్ అయినప్పుడు ఆమెతో పాటే అసిస్టెంట్ గా వచ్చాడనీ జోసఫ్ తెలిపారు. జనవరి 21న అతను తమ ఇంటి నుంచి వెళ్లిపోయాడనీ, అంతకుముందే అతనికి యాక్సిడెంట్ జరిగితే 2.7 లక్షల రూపాయలు కూడా ఖర్చుపెట్టామనీ చెప్పారు. ఆరోగ్యం చేకూరిన తర్వాత చెన్నై వెళ్లిపోతానని అతను చెప్పడంతో అతనికి రావలసిన సొమ్ము ఇచ్చి జనవరి 21న చెన్నైకి పంపేశామనీ, ఇదే సమాచారాన్ని ఫిబ్రవరి 8న ముంబై పోలీసుల వద్ద కూడా రిజిస్టర్ చేశామని వివరించారు. ఈమధ్యనే ముత్తుకుమార్ తల్లి ముంబై వచ్చినప్పుడు జరిగిన విషయం ఆమెకు చెప్పామనీ, ఆమె చెన్నై చేరుకున్న తర్వాత తన కొడుకు జాడ తెలియలేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిందనీ అన్నారు. దీంతో చెన్నై పోలీసులు సైతం తనను కలుసుకున్నారనీ, వాస్తవాలను వివరించే పూర్తి సమాచారం వారికి అందజేశామన్నారు. తాను ఇచ్చిన సమాచారంతో వారు సంతృప్తి చెందినట్టు భావిస్తున్నానని తెలిపారు. జోసఫ్ వివరణ అనంతరం ఈ వ్యవహారం ఎలాంటి మలుపులు తిరుగుతుందనేది చూడాలి.
News Posted: 19 March, 2009
|