'రణ్' గీతంపై సెన్సార్
అనుకున్నంతా అయింది. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన తాజా చిత్రం 'రణ్'లో టైటిల్ ట్రాక్ కోసం జాతీయ గీతమైన 'జన గణ మన అధినాయక జయహే' గీతాన్ని 'జన గణ మన రణ్ హై' అంటూ రీమిక్స్ చేసి పాడించడంపై సెన్సార్ బోర్డు శనివారం నాడు అభ్యంతరం తెలిపింది. దీనిని ఎంతమాత్రం అనుమతించేది లేదని సెన్సార్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సిబిఎఫ్సి) తేల్చిచెప్పింది.
జాతీయ గీతాన్ని రీమిక్స్ చేసి పాడించిన ఫిల్మ్ ప్రమోను సెన్సార్ బోర్డు సమీక్షించిందనీ, జాతీయ గౌరవానికి భంగం కలగకుండా నిరోధించే 1971 చట్టం, సినిమాటోగ్రఫీ చట్టంలోని నిబంధనల ప్రకారం అనుమతి నిరాకరించాలని బోర్డు నిర్ణయించిందనీ సిబిఎఫ్ సి చైర్ పర్సన్ షర్మిలా ఠాగూర్ సెక్రటరీ విజయ చావక్ తెలిపారు. ఈ విషయమై 'రణ్' నిర్మాత షీతల్ తల్వార్ ను వివరణ కోరినప్పుడు, కొద్దిరోజుల క్రితమే ఈ ప్రమోను సిబిఎఫ్ సికి సమర్పించినట్టు తెలిపారు. సిబిఎఫ్ సి నిర్ణయంపై అధికారికంగా తమకు ఎలాటి సమాచారం అందలేదనీ, సెన్సార్ అభ్యంతరాలు తెలుసుకున్న తర్వాతే తాము ఒక నిర్ణయానికి రాగలమనీ తల్వార్ చెప్పారు. వర్మ సైతం ఈ వారం ప్రారంభంలో న్యూఢిల్లీలో జరిగిన 'రణ్' తొలి ప్రమోలో జాతీయ గీతాన్ని రీమిక్స్ చేయడాన్ని సమర్ధించుకున్నారు. లిరిక్స్ ద్వారా తన భావాలను వ్యక్తపరచే ప్రయత్నం చేశాననీ, జాతీయగీతాన్ని ఏమాత్రం కించ పరచలేదనీ ఆయన తెలిపారు. భారత చలనచిత్ర పరిశ్రమలో తనకున్న 15 ఏళ్ల అనుభవాన్ని రంగరించి ఈ చిత్రాన్ని తెరకెక్కించాననీ, మీడియా వ్యాపారంలోని సైకలాజికల్ కోణాన్ని ఈ చిత్రం ఆవిష్కరిస్తుందనీ తెలిపారు. అమితాబ్ బచ్చన్ లీడ్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రంలో పరేష్ రావల్, రజత్ కపూర్, రితీష్ దేష్ ముఖ్, మనీషా కొయిరాలా, పూరబ్ కోహ్లి తదితరులు నటించారు. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
.
News Posted: 9 May, 2009
|