ఏ పార్టీకి, ఎన్ని నిధులు?
బడా దాత బిర్లా
కుమార మంగళం బిర్లా అధ్యక్షతన గల ఆదిత్య బిర్లా గ్రూప్ దేశంలో పెద్ద దాత సంస్థగా ఆవిర్భవించింది. ఈ గ్రూప్ రూ. 24.67 కోట్ల మేరకు విరాళాలు అందజేసింది. దీనిలో సింహభాగం రూ. 21.71 కోట్ల మేరకు కాంగ్రెస్ కు అందగా బిజెపికి రూ. 2.96 కోట్లు అందాయి. బిర్లా జనరల్ ఎలక్టొరల్ ట్రస్ట్ ఈ రెండింటికి మాత్రమే విరాళాలు అందజేసింది. బిజెపి రాజకీయ అవసరాల కోసం సిల్వాసాలో గల పబ్లిక్ అండ్ పొలిటికల్ అవేర్ నెస్ ట్రస్ట్ ప్రధానంగా నిధులు అందజేస్తున్నది. బిజెపి 2003, 2007 మధ్య ఈ ట్రస్ట్ నుంచి రూ. 9.5 కోట్లు అందుకున్నది. ఈ ట్రస్ట్ కు నిధులు ఎక్కువగా అనిల్ అగర్వాల్ కు చెందిన స్టెర్లైట్ గ్రూప్ నుంచి అందుతుంటాయి.
2000 సంవత్సరంలో ప్రభుత్వ రంగ సంస్థ బాల్కోలో 51 శాతం వాటాలను అప్పటి జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్ డిఎ) ప్రభుత్వం స్టెర్లైట్ గ్రూపునకే విక్రయించింది. స్టెర్లైట్ ఇండస్ట్రీస్ కాంగ్రెస్ పార్టీకి కోటి రూపాయలను, బిజెపికి రూ. 50 లక్షలను విరాళంగా అందజేసింది. వేణుగోపాల్ ధూత్ సారథ్యంలోని వీడియోకాన్ వినిమయ వస్తువుల గ్రూప్ బిజెపి, కాంగ్రెస్, శివసేన పార్టీలకు రూ. 10 కోట్లకు పైగా విరాళాలు అందజేసింది. ఇందులో రూ. 4.5 కోట్లు కాంగ్రెస్ కు, రూ. 3.5 కోట్లు బిజెపికి అందగా శివసేనకు రూ. 2.63 కోట్లు సమకూరాయి. ధూత్ సోదరుడు రాజ్ కుమార్ శివసేన సౌజన్యంతో రాజ్యసభలో సభ్యుడుగా ఉన్నారు.
ఇక టాటా గ్రూపు రూ. 4.32 కోట్లను కాంగ్రెస్ కు, రూ. 2.67 కోట్లను బిజెపికి విరాళంగా అందజేసింది. ఈ గ్రూపు నుంచి శివసేనకు రూ. 60.94 లక్షలు, టిడిపికి రూ. 48.48 లక్షలు అందాయి. ఎలక్టొరల్ ట్రస్ట్ ద్వారా ఈ విరాళాలు అందజేశారు. పారదర్శకంగా రాజకీయ నిధులను సమకూర్చడాన్ని ప్రోత్సహించడం కోసం 1999 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ ట్రస్ట్ ను ఏర్పాటు చేశారు.
Pages: -1- -2- 3 -4- -5- News Posted: 5 March, 2009
|