ఏ పార్టీకి, ఎన్ని నిధులు?
సరకుల ట్రేడింగ్, వంటనూనెల వ్యాపారం, మౌళిక వసతుల కల్పన, ప్రైవేట్ రేవు కార్యకలాపాలు వంటి లావాదేవీలు నిర్వర్తించే గుజరాత్ కు చెందిన అదానీ గ్రూప్ బిజెపికి ఇతోధికంగా విరాళాలు ఇస్తున్నది. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడితో గౌతమ్ అదానీకి గల సాన్నిహిత్యం కారణంగా బిజెపికి రూ. 4 కోట్లు విరాళాలుగా అందాయి. కాంగ్రెస్ కు ఈ గ్రూపు నుంచి రూ. 20 లక్షలు విరాళాలు అందాయి. నరేంద్ర మోడి తరచు గౌతమ్ అదానీ ప్రైవేట్ విమానాలను తన పర్యటనలకు ఉపయోగిస్తుంటారు.
ఇక ప్రొఫెషనల్ తరహా మేనేజ్ మెంట్ గల ఇండియన్ టుబాకో కంపెనీ (ఐటిసి సంస్థ) ప్రతి పార్టీ పార్లమెంటరీ ప్రాతినిధ్యం ప్రాతిపదికగా విస్తృతంగా విరాళాలు అందజేస్తుంటుంది. ఈ సంస్థ రూ. 1.45 కోట్లను కాంగ్రెస్ కు, రూ. 1.38 కోట్లను బిజెపికి, రూ. 36 లక్షలను సమాజ్ వాది పార్టీకి, రూ. 12 లక్షలను శివసేనకు, రూ. 14.5 లక్షలను టిడిపికి, రూ. 8 లక్షలను జనతా దళ్ (యు)కు, రూ. 5 లక్షలను ఎఐఎడిఎంకెకు అందజేసింది. భారీ ఇంజనీరింగ్ సంస్థ లార్సెన్ అండ్ టూబ్రో (ఎల్ అండ్ టి) బిజెపికి రూ. 1.6 కోట్లు, కాంగ్రెస్ కు కోటి రూపాయలు, శివసేనకు రూ. 35 లక్షలు మేరకు విరాళాలు అందజేసింది. ఇక మహీంద్రా గ్రూపు కాంగ్రెస్, బిజెపి, శివసేన, టిడిపిలకు రూ 2.2 కోట్లను పంచింది. బజాజ్ గ్రూపు కాంగ్రెస్, బిజెపిలకు చెరొక కోటి రూపాయలు విరాళాలు ఇచ్చింది.
కాంగ్రెస్ టిక్కెట్ పై లోక్ సభకు ఎన్నికైన నవీన్ జిందాల్ ఆ పార్టీకి కోటి రూపాయలు విరాళంగా అందజేశారు. ఆయన కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థి బిజెపికి కూడా రూ. 75 లక్షలు విరాళంగా అందజేశారు. దేశవ్యాప్తంగా విమానాశ్రయాల అభివృద్ధి ప్రాజెక్టులకు కాంట్రాక్టులు సంపాదించిన జిఎంఆర్ గ్రూపు బిజెపికి కోటి రూపాయలు, కాంగ్రెస్ కు రూ. 25 లక్షలను జిఎంఆర్ పవర్ కార్పొరేషన్, దాని ప్రమోటర్ల ద్వారా అందజేసింది. 2005 జూన్ లో విజయ్ మాల్యా పరమైన షావాలెస్ గ్రూప్ బిజెపికి 2004-05లో కోటి రూపాయలను విరాళంగా అందజేసింది.
పార్టీలకు విరాళాలు అందజేసిన వాణిజ్య సంస్థల జాబితాలో ఇంకా పెక్కు ప్రముఖ పేర్లు ఉన్నాయి. ఫార్మా సంస్థ రాన్ బాక్సీ కాంగ్రెస్ కు రూ. 65 లక్షలు, బిజెపికి రూ. 35 లక్షలు, టిడిపికి రూ. 5 లక్షలు వెరసి రూ. 95 లక్షలు విరాళాలు అందజేసింది. ఎల్ఎం థాపార్ గ్రూపు కాంగ్రెస్, బిజెపిలకు రూ. 70 లక్షల మేరకు విరాళాలు అందజేసింది. ఉమేష్ మోడి గ్రూపు బిజెపికి రూ. 50 లక్షలు, కాంగ్రెస్ కు రూ. 25 లక్షలు అందజేసింది.
అంత పేరు ప్రఖ్యాతులు లేని విరాళాల దాతలలో అకిక్ ఎడ్యుకేషన్ సెంటర్ కూడా ఉంది. ఢిల్లీ షాదారాలోని బలదేవ్ పార్క్ ప్రాంతంలో గల ఈ సంస్థ బిజెపికి కోటిన్నర రూపాయలు విరాళంగా అందజేసింది. సదరు అడ్రెస్ లో మూడంతస్తుల భవనం ఉంది. కాని డిఎన్ఎ వార్తా సంస్థ విలేకరికి అక్కడ ఏ విద్యా సంస్థా కనిపించలేదు. అహ్మదాబాద్ కు చెందిన నిమా స్పెసిఫిక్ ఫ్యామిలీ ట్రస్ట్ బిజెపికి కోటి రూపాయలు, కాంగ్రెస్ కు రూ. 30 లక్షల మేరకు విరాళాలు అందజేసింది.
Pages: -1- -2- -3- 4 -5- News Posted: 5 March, 2009
|